‘కుల్దీప్‌ను హెచ్చరించా.. అది మేనేజ్‌మెంట్‌ ఇష్టం’ | I told Dont Be Desperate To: Gambhir Reveals Message To Kuldeep | Sakshi
Sakshi News home page

కుల్దీప్‌ను హెచ్చరించా.. అది మేనేజ్‌మెంట్‌ ఇష్టం: గంభీర్‌

Aug 22 2026 6:05 PM | Updated on Aug 22 2026 6:05 PM

I told Dont Be Desperate To: Gambhir Reveals Message To Kuldeep

PC: BCCI/Sonysports

శ్రీలంకతో తొలి టెస్టులో భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సేవలను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ మొత్తంగా 25 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

సారాంశ్‌ జైన్‌ అరంగేట్రం!
మొత్తంగా 103 పరుగులు ఇచ్చిన కుల్దీప్‌ యాదవ్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరిగే నిర్ణయాత్మక రెండో టెస్టు నుంచి అతడిని తప్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కుల్దీప్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కుల్దీప్‌ గురించి స్పందించాడు. ‘‘టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లను ఆడించినపుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు వస్తాయి. దీనర్థం ఆ బౌలర్‌ సరిగ్గా ఆడటం లేదని కాదు.

కుల్దీప్‌ను హెచ్చరించాను
ఎవరిని ఎప్పుడు పంపాలనేది కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఈ బౌలర్‌ వద్దు అని అనుకుంటే.. అతడిని పక్కనపెట్టి వేరే వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తారు. నేను కుల్దీప్‌తో మాట్లాడాను. వికెట్లు తీయాలనే తొందరతో కాకుండా.. పొదుపుగా బౌలింగ్‌ చేయడంపై దృష్టి పెట్టమని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని చెప్పాను’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

ఐదుగురు ఉంటే మంచిదే
అదే విధంగా.. ఐదుగురు బౌలర్లను ఆడించడంపై స్పందిస్తూ.. ‘‘టస్టు మ్యాచ్‌లో వెయ్యి పరుగులు చేసినా.. ఆ స్కోరుతో గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. అయితే, అదే మ్యాచ్‌లో మనం 20 వికెట్లు కూల్చినట్లయితే గెలుస్తామనే నమ్మకమైనా వస్తుంది.

ఫ్లాట్‌ పిచ్‌లపై మాత్రం బౌలర్లు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మా జట్టులో ఐదుగురు ప్రాపర్‌ బౌలర్లు ఉండటం సానుకూలాంశం. కాబట్టి పిచ్‌ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లను మారుస్తూ ఉంటాము. 

ఐదుగురు బౌలర్లు ఉన్నపుడు రక్షణాత్మక ధోరణిలో కాకుండా.. ప్రభావం చూపే విధంగా ఆడటం సాధ్యమవుతుంది’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక- భారత్‌ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబో వేదిక.

చదవండి: స్మిత్‌ తొండాట.. అంపైర్‌ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement