సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్వా మారన్ వివాదంలో చిక్కుకుంది. హండ్రెడ్ లీగ్-2026 వేలంలో పాక్ ఆటగాడిని కొనుగోలు చేసి, భారత క్రికెట్ అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటుంది. కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్లోని సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో తొలిసారి జరుగుతున్న వేలంలో పాల్గొన్న ఆమె.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను 1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. మరో ఫ్రాంచైజీతో (ట్రెంట్ రాకెట్స్) పోటీపడి మరీ అబ్రార్ను దక్కించుకుంది. ఈ చర్యతో కావ్వా భారత క్రికెట్ అభిమానుల పాలిట విలన్గా మారిపోయింది.
అబ్రార్ అహ్మద్ ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్ల్లో ఓవరాక్షన్ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఔట్ చేసి చాలా అతి చేశాడు. ఇందుకు భారత ఆటగాళ్లు కూడా తగిన కౌంటర్లు ఇచ్చినప్పటికీ భారతీయుల కసి తీరలేదు. అలాంటి అబ్రార్ను కావ్యా మారన్ జట్టులో చేర్చుకోవడం భారతీయులకు మింగుడుపడటం లేదు.
దీనికి ముందే కావ్యా మరో పాక్ ఆటగాడు (హరీస్ రౌఫ్) వేలానికి రాగా, అతన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు శభాష్ అనుకున్న భారత క్రికెట్ అభిమానులు, అబ్రార్ తీసుకున్న వెంటనే సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ ప్రారంభించారు.
ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. వేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన పాక్ ఆటగాళ్లు ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ మాత్రమే. మరో పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా వేలానికి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. కాగా, కొద్ది గంటల ముందే పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఈ వేలం బరి నుంచి వైదొలిగాడు. ఈ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ ద్వారా జరిగేది. ఈ సీజన్తో తొలిసారి ఐపీఎల్ తరహా వేలం జరుగుతుంది.
నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.
ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.


