చరిత్ర సృష్టించిన ట్రెంట్‌ బౌల్ట్‌ | Trent Boult becomes the first Cricketer to be part of all MI family teams | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ట్రెంట్‌ బౌల్ట్‌

Mar 12 2026 8:30 PM | Updated on Mar 12 2026 8:30 PM

Trent Boult becomes the first Cricketer to be part of all MI family teams

న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో ప్రతి ఫ్రాంచైజీకి ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్‌.. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన బౌల్ట్‌.. తాజాగా ద హండ్రెడ్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అయిన ఎంఐ లండన్‌కు ఎంపికయ్యాడు. 

బౌల్ట్‌ను ఇవాళ (మార్చి 12) జరిగిన వేలంలో ఎంఐ లండన్‌ లక్ష స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.23 కోట్లు) సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌల్ట్‌ ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రతి ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో టైటిల్‌ నెగ్గాడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల తరఫున అతనాడిన ప్రతి ఫైనల్‌లోనూ అతని జట్టు నెగ్గింది.

ఇదిలా ఉంటే, హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం​ జరుగుతుంది. ఈ సీజన్‌ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్‌ తరహా వేలం​ జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.

ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

ఈ వేలంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు))  ఎంపిక చేసుకుంది. 

ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement