హండ్రెడ్ లీగ్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న వేలంలో పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ జాక్పాట్ కొట్టాడు. ఇతన్ని బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. లక్ష పౌండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో నిలిచిన తారిక్ కోసం ట్రెంట్ రాకెట్స్ కూడా పోటీపడింది. ఫీనిక్స్, రాకెట్స్ రెండూ ఐపీఎల్ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కావు.
ఈ వేలంలో అమ్ముడుపోయిన తొలి పాకిస్తాన్ ఆటగాడు తారిక్. ఇతనికి ముందు హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఫ్రిది, రౌఫ్ మార్కీ ప్లేయర్లుగా వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
తొలిసారి వేలం
హండ్రెడ్ లీగ్లో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్ లీగ్ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్, బెత్ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి స్టార్ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్ ఫాతిమా సనా కూడా అన్ సోల్డ్గా మిగిలిపోయింది.
నిర్వహకులు భరోసా ఇచ్చినా..!
ప్రస్తుతం హండ్రెడ్ లీగ్లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ యాజమాన్యాలు పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్ లీగ్లో మాత్రం ఆ పరిస్థితి లేదు.
లీగ్ నిర్వాహకులు పాక్ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. దీంతో ఈ వేలంలో 63 మంది పాక్ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్లిస్ట్ అయ్యారు. ఈ 14 మందిలో ప్రస్తుతానికి ఉస్మాన్ తారిక్ ఒక్కడే అమ్ముడుపోయాడు.
అనామక ఆటగాడిపై కనకవర్షం
ఇప్పటివరకు జరిగిన వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.


