క్రికెట్లో అంపైర్ల పాత్ర చాలా కీలకం. సాంకేతికత ఎంత పెరిగినా, మైదానంలో అంపైర్ల నిర్ణయాలే ఆట గమనాన్ని, ఫలితాన్ని శాసిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేవలం అవుట్ లేదా నాటౌట్ అని నిర్ణయించడమే కాకుండా, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనను పర్యవేక్షించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం వారి ప్రధాన బాధ్యత. ఇన్ని బాధ్యతలను నిర్వర్తించే అంపైర్లకు లభించే పారితోషికం ఎంత ఉంటుందనేది చాలా మందికి తెలియదు.
తాజాగా ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ అఫీషియల్స్కు ఎంత చెల్లిస్తారో మాజీ అంపైర్ అనిల్ చౌదరి వెల్లడించారు. ఒక ఐపీఎల్ సీజన్లో అంపైర్లు రూ. 45-50 లక్షల వరకు సంపాదించవచ్చని అతడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఒక మ్యాచ్కు అంపైర్లకు 4000 డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 3.8 లక్షలు) లభిస్తోంది. ప్లే ఆఫ్స్లో అయితే 6000 డాలర్లు(సుమారు రూ. 5.7 లక్షలు) మ్యాచ్ ఫీజుగా ఉంటుంది. అదే ఫైనల్లో అయితే అంపైర్లకు 8000 డాలర్లు(సుమారు రూ. 7.5 లక్షలు) అందుతోంది. ఇవి కాకుండా అదనంగా దాదాపు 6,000 డాలర్లు రోజువారీ భత్యంగా లభిస్తుంది. ఒక సాధారణ అంపైర్ ఒక ఐపీఎల్ సీజన్లో సుమారు రూ. 45-50 లక్షలు సంపాదిస్తారు.
దీనికితోడు దేశవాళీ క్రికెట్లోనూ అగ్రశ్రేణి అంపైర్గా ఉంటే, అదనంగా మరో రూ. 20-25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే.. ఒక్క టెస్టు మ్యాచ్కు అంపైర్లకు రూ. 8 లక్షల పారితోషికం లభిస్తుంది.
ఒక్కో టీ20 మ్యాచ్కు సుమారు రూ. 2 లక్షలు, వన్డే మ్యాచ్కు రూ. 4 లక్షల వరకు లభిస్తోంది. మ్యాచ్ జరిగినా, జరగకపోయినా వారి ఫీజును మాత్రం చెల్లిస్తారు" అని ఓ పాడ్కాస్ట్లో చౌదరి పేర్కొన్నారు. అయితే ఐసీసీ ఎలైట్ ప్యానెల్, సాధరణ అంతర్జాతీయ అంపైర్ల జీతాలు వేరుగా ఉంటాయి.
వారి అనుభవం, గ్రేడింగ్ను బట్టి పారితోషికాలను నిర్ణయిస్తారు. అత్యధిక పారితోషకం టెస్టుల్లోనే లభిస్తోంది. ఒకవేళ ఐదు రోజుల ఆట రద్దు అయినా కూడా వారికి రూ.8 లక్షల ఫీజును అందజేస్తారు. ఇక డొమెస్టిక్ క్రికెట్లో అంపైర్ల జీతాలతో పోలిస్తే ఐపీఎల్లో అంపైర్ల సాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా ఓ డొమెస్టిక్ మ్యాచ్లో గ్రేడ్ ఏ అంపైర్ అయితే రోజుకు రూ.40వేలు, గ్రేడ్-బి అంపైర్ అయితే రూ.30 వేల చొప్పున సంపాదిస్తాడు. నాలుగు రోజుల మ్యాచ్ అయితే రూ.1.2 లక్షల నుంచి రూ.1.6లక్షలు చొప్పున అందుకుంటూ ఉంటారు.
చదవండి: అగ్రపీఠంపై పాకెట్ డైనమైట్


