
మూడోసారి బీఎండబ్ల్యూ ఓపెన్ టైటిల్ గెలిచిన జర్మనీ స్టార్
మ్యూనిక్ (జర్మనీ): స్వదేశంలో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అదరగొట్టాడు. తన 28వ పుట్టిన రోజున... తనకెంతో కలిసొచ్చిన బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో జ్వెరెవ్ మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జ్వెరెవ్ 6–2, 6–4తో అమెరికాకు చెందిన రెండో సీడ్ బెన్ షెల్టన్ను ఓడించాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకున్నాడు.
2017, 2018లలో కూడా ఈ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ ఓవరాల్గా తన కెరీర్లో 24వ టైటిల్ను సాధించాడు. చాంపియన్గా నిలిచిన జ్వెరెవ్కు 4,67,485 యూరోల (రూ. 4 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు రూ. 1 కోటీ 40 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎం70 మోడల్ ఎలక్ట్రిక్ కారు లభించింది.