
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో వారం రోజులలో ఆరంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.
నేటి నుంచి భారత సీనియర్ టీమ్-ఇండియా 'ఎ' జట్ల మధ్య వార్మాప్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి భారత్కు వచ్చేసినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా సదరు రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలోనే గంభీర్ హుటాహుటిన స్వదేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లండ్కు వెళ్తాడన్నది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు ప్రారంభానికి ముందే జట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవకాశముంది. కాగా వైట్బాల్ సిరీస్లలో కోచ్గా విజయవంతమైన గౌతీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఇంకా తన మార్క్ను చూపించలేకపోయాడు.
అతడి నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘోర పరాభావాలను మూటకట్టుకుంది. దీంతో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే.
చదవండి: న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత