జెంటిల్ మ్యాన్ గేమ్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా.. సిక్సర్లు కొట్టినా.. రికార్డులు తిరగరాసినా.. ఒక్క రెండు మ్యాచ్లలో విఫలమైతే జట్టులో చోటు కోల్పవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ విషయంలో అదే జరిగింది.
టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పుడు తుది జట్టులో తన స్ధానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.
దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20కు సంజూను టీమ్ మేనెజెమెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకు అవకాశమిచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.
శాంసన్ను ఓదార్చిన గంభీర్
కాగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంతో సంజూ శాంసన్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చాడు. టాస్ తర్వాత కోచ్ గంభీర్, శాంసన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయి వేసి ధైర్యం చెబుతూ కనిపించారు.
శాంసన్ ఐపీఎల్-2026లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలతో 477 పరుగులు చేశాడు. అయినప్పటికి వరుసగా మూడు మ్యాచ్లలో ఫెయిల్ కావడంతో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు.
Good to see Gautam Gambhir having a chat with Sanju Samson. That's always one thing you need from the management. pic.twitter.com/woihQi2l82
— Pitch Perfect (@_pitch__perfect) July 4, 2026


