టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీలకమైన సూపర్-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన భారత్ .. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది.
అద్బుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్కు కాదని వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో ఛాన్స్ వచ్చారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో గంభీర్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అతడు అన్నాడు.
"గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని కచ్చితంగా పెంచుతోంది.
భారత జట్టు వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లను భారత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ను సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి వైరలైంది.
బహుశా సూర్యకుమార్తో ఉన్న గొడవ వల్లే కులదీప్ను తప్పించారని అందరూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అతడి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.
గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు అదే తరహా రాజకీయాలను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ తన సొంతప్రయోగాలతో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు.


