Rishabh Pant: 'గబ్బా వారియర్‌ మిస్‌ యూ.. నీ లోటు తెలుస్తోంది'

Fans Placards-Rishabh Pant We Missing You IND Vs AUS 1st Test Nagpur - Sakshi

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ అనుకున్నంత గొప్పగా ఏం సాగడం లేదు. పిచ్‌ స్పిన్నర్లకు ప్రభావం చూపిస్తున్నప్పటికి కాస్త ఓపికతో బ్యాటింగ్‌ చేస్తే పరుగులు వస్తాయని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సెంచరీతో చూపించాడు. రోహిత్‌ మినహా టాపార్డర్‌లో కేఎల్‌ రాహుల్‌(20 పరుగులు), పుజారా(7 పరుగులు).. మిడిలార్డర్‌లో కోహ్లి(12 పరుగులు), సూర్యకుమార్‌(8)లు నిరాశపరిచారు.

ప్రత్యర్థి జట్టు కొత్త బౌలర్‌ను తీసుకొస్తే టీమిండియా బ్యాటింగ్‌ సరిగా చేయలేదనే అపవాదు ఉంది. తాజాగా టాడ్‌ మర్ఫీకి టీమిండియాతో జరుగుతున్న  తొలి టెస్టు అతనికి అరంగేట్రం మ్యాచ్‌ కావడం విశేషం. అతను తీసిన ఐదు వికెట్లలో నాలుగు కీలకమైనవే ఉన్నాయి.  అయితే లోయర్‌ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌ పటేల్‌లు కాస్త కుదురుకోవడంతో టీమిండియా రెండోరోజు ఆటలో నిలబడినట్లుగా అనిపించింది. 

అయితే మిడిలార్డర్‌ విఫలం కాగానే మ్యాచ్‌ చూడడానికి వచ్చిన అభిమానులు పంత్‌ ఫోటో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ''గబ్బా వారియర్‌ను మిస్‌ అవుతున్నాం.. నువ్వు లేని లోటు తెలుస్తోంది పంత్‌'' అంటూ ప్లకార్డులో పేర్కొ‍న్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భారత్‌ జట్టు రహానే నేతృత్వంలో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీని 2-1 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. సీనియర్ల గైర్హాజరీలో కుర్రాళ్ల అండతో టీమిండియా సిరీస్‌ గెలవడం భారత్‌ క్రికెట్‌లో సువర్ణాధ్యాయంగా మిగిలిపోయింది. ఇక గబ్బా వేదికగా చివరి టెస్టులో పంత్‌ 89 పరుగులు నాటౌట్‌ అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించి గబ్బా హీరోగా నిలిచాడు. అప్పటి టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలిచి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 

ఇక టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే దారిలో రూర్కీ సమీపంలో కారు యాక్సిడెంట్‌కు గురి కావడంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్‌ ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సర్జరీలు నిర్వహించిన వైద్యులు పంత్‌ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పైనే పట్టే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పంత్‌ BGT 2023తో పాటు ఐపీఎల్‌, ఆసియా కప్‌, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కూడా పంత్‌ ఆడడం అనుమానమే. 

చదవండి: 'అందమైన భార్య ఉన్నా ఇదే చెప్తావా?'

BGT 2023: అసలే అతడికి పిచ్చి.. నువ్వెందుకిలా? జడ్డూకు రోహిత్‌ వార్నింగ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top