స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్‌.. వైరల్‌ వీడియో | England Tour: Rishabh Pant Breaks Stadium's Roof With Monstrous Six During Practice | Sakshi
Sakshi News home page

స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్‌.. వైరల్‌ వీడియో

Jun 10 2025 12:46 PM | Updated on Jun 10 2025 2:17 PM

England Tour: Rishabh Pant Breaks Stadium's Roof With Monstrous Six During Practice

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ జూన్‌ 20న లీడ్స్‌లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ జూన్‌ 13 నుంచి 16 వరకు కెంట్‌ కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌ కోసం భారత్‌ రెండు వారాల ముందే ఇంగ్లండ్‌లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఓ భారీ సిక్సర్‌ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో పంత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్‌ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.

పంత్‌ను ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అతను తొలిసారి భారత టెస్ట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్‌ ఇంగ్లండ్‌ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.

పేలవ ఫామ్‌ కొనసాగినా..!
పంత్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్‌ ఆధ్యాంతం పేలవ ఫామ్‌లో కొనసాగిన పంత్‌.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పంత్‌ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్‌) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్‌లో పంత్‌ జట్టు ఎల్‌ఎస్‌జీ ఓటమిపాలైంది. 

జితేశ్‌ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్‌కు ముందు ఎల్‌ఎస్‌జీ పంత్‌ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్‌లో పంత్‌ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్‌ ఆరంభంలో టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఇంగ్లండ్‌ పర్యటనలోనైనా పంత్‌ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement