
ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత ఇంగ్లండ్ బౌలర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆదిల్ రషీద్ (4-0-29-3), జేమీ ఓవర్టన్ (4-0-17-2), లియామ్ డాసన్ (2-0-9-2) అద్బుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్ను కట్టడి చేశారు. రెహాన్ అహ్మద్ (3-0-24-1) కూడా పర్వాలేదనిపించాడు.
ఐర్లాండ్ బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గెరాత్ డెలానీ (29 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల కారణంగా ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాస్ అదైర్ (33), హ్యారీ టెక్టార్ (28), బెంజమిన్ కాలిట్జ్ (22) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (7), లోర్కాన్ టక్కర్ (1), కర్టిస్ క్యాంపర్ (2), బ్యారీ మెక్కార్తీ (0), మాథ్యూ హంఫ్రేస్ (7) నిరాశపరిచారు.
అనంతరం 155 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలో కాస్త తటపటాయించినా, ఆతర్వాత తమ సహజ సిద్దమైన దూకుడు ప్రదర్శించింది. బట్లర్ 0, బేతెల్ 15 పరుగులకే ఔటైనా.. ఫిల్ సాల్ట్ (29), జోర్డన్ కాక్స్ (55) వేగంగా ఆడారు. టామ్ బాంటన్ (37 నాటౌట్), రెహాన్ అహ్మద్ (9 నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది.