
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్ డకెట్ 43, జాక్ క్రాలే 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ దక్కలేదు.
బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో 5, సిరాజ్ 4 ఓవర్లు వేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేలను తలపించి ఆడారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 281 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.
భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.