
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డును సమం చేశాడు. సచిన్, అజహార్, జైస్వాల్ ఇంగ్లండ్పై తలో 16 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు.
ఇంగ్లండ్పై అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 47 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (20), కెప్టెన్ శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు దక్కింది.
కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.
తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.