
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అగ్రస్థానానికి ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న బ్రంట్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్కు చేరింది. ఈ క్రమంలో టాప్ ర్యాంక్లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధనను కిందకు దించింది.
గతంలో చాలాసార్లు నంబర్ వన్ బ్యాటర్గా నిలిచిన బ్రంట్.. ఈ ఏడాది తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. తాజాగా భారత్తో ముగిసిన సిరీస్లో రాణించడంతో బ్రంట్ అత్యున్నత స్థానానికి చేరింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 1-2 తేడాతో ఓడినా, బ్రంట్ 3 మ్యాచ్ల్లో 53.33 సగటున 160 పరుగులు చేసి సత్తా చాటింది. మూడో వన్డేలో బ్రంట్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్ ఆమెకు టాప్ ర్యాంక్ను కట్టబెట్టింది.
మరోవైపు భారత స్టార్ స్మృతి మంధన కూడా ఈ సిరీస్లో పర్వాలేదనిపించింది. అయితే బ్రంట్ కంటే మెరుగ్గా రాణించకపోవడంతో టాప్ ప్లేస్ను కోల్పోయింది. మంధన ఈ సిరీస్లో 3 ఇన్నింగ్స్ల్లో 115 పరుగులకే పరిమితమై, రెండో స్థానానికి పడిపోయింది.
భారీ జంప్ కొట్టిన టీమిండియా కెప్టెన్
తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భారీ జంప్ కొట్టింది. ఇంగ్లండ్తో మూడో వన్డేలో రికార్డు సెంచరీ బాదిన ఆమె ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగెజ్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్లో భారత బౌలర్లకు సానుకూల ఫలితాలు రాలేదు. స్పిన్నర్ దీప్తి శర్మ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఆమె తర్వాత స్నేహ్ రాణా మెరుగైన స్థానంలో (21) ఉంది. ఈ వారం టాప్-3 బౌలర్లుగా సోఫీ ఎక్లెస్టోన్, యాష్ గార్డ్నర్, మెగన్ షట్ కొనసాగుతున్నారు.