చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌ | Divya Deshmukh created history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌

Jul 24 2025 2:01 AM | Updated on Jul 24 2025 2:01 AM

Divya Deshmukh created history

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అద్భుత విజయాన్ని అందుకున్న భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది. జార్జియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి దివ్య 1.5–0.5తో 2017 ప్రపంచ చాంపియన్‌ టాన్‌ జోంగి (చైనా)పై గెలిచింది. 

మంగళవారం వీరిద్దరి మధ్య తొలి గేమ్‌ ‘డ్రా’కాగా... బుధవారం జరిగిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 101 ఎత్తుల్లో టాన్‌ జోంగిని ఓడించి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో దివ్య వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా అర్హత సాధించింది. తాజా ప్రదర్శనతో దివ్య ఖాతాలో తొలి గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) నార్మ్‌ కూడా చేరింది. 

కోనేరు హంపి (భారత్‌)–లె టింగ్జి (చైనా) మధ్య సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో దివ్య ఆడుతుంది. హంపి–లె టింగ్జి మధ్య బుధవారం జరిగిన రెండో గేమ్‌ కూడా 75 ఎత్తుల్లో ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. హంపి–టింగ్జి మధ్య ఈరోజు టైబ్రేక్‌ గేమ్స్‌ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.    

Advertisement
 
Advertisement
Advertisement