
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడేందకు సిద్దమవుతోంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్తో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు సోమవారం సిడ్నీలో అడుగుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా టీ20 ప్రపంచకప్ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 82 పరుగులు చేసిన విరాట్ అజేయంగా నిలిచి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
అఖరి ఓవర్లో హై డ్రామా..
కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. చివరి ఆరు బంతుల్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా... పాక్ కెప్టెన్ బాబర్, నవాజ్ చేతికి బంతిని అందించాడు. తొలి బంతికి హార్దిక్ పెవిలియన్కు చేరాడు. అనంతరం రెండో బంతిని క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు.
ఇక మూడో బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. ఇక నాలుగో బంతిని నవాజ్ హై ఫుల్ టాస్ వేయగా.. కోహ్లి సిక్సర్గా మలిచాడు. అయితే నాలుగో బంతి నడుమ ఎత్తుకంటే ఎక్కువగా ఉండటంతో అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. దీంతో భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. అయితే ఫ్రీ హిట్ బంతిని నవాజ్ వైడ్గా వేశాడు.
దీంతో భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. అనంతరం ఫ్రీహిట్ బంతికి విరాట్ క్లీన్ బౌల్డయ్యాడు. అయినప్పటికీ విరాట్, కార్తీక్ బైస్ రూపంలో మూడు పరుగులు వచ్చాయి. ఇక భారత్ విజయానికి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ క్రమంలో కార్తీక్ అనవసర షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.
దీంతో మళ్లీ అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ సమయంలో క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. అయితే ఆరో బంతిని కూడా నవాజ్ వైడ్గా వేశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఇక ఆఖరి బంతికి అశ్విన్ సింగిల్ తీసి జట్టును గెలిపించాడు.
అశ్విన్కు థాంక్స్ చెప్పిన కార్తీక్
ఇక ఆఖరి బంతికి సింగిల్ తీసి జట్టును విజయ తీరాలకు చేర్చిన అశ్విన్కు దినేష్ కార్తీక్ ధన్యవాదాలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో.. "మ్యాచ్ను ఫినిష్ చేసినందుకు దన్యవాదాలు. నేను ఇప్పుడు కూల్గా ఉన్నాను అని అశ్విన్తో డీకే అన్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలై ఉంటే కచ్చితంగా అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న కార్తీక్పై విమర్శలు వచ్చేవి. ఇక డీకే వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును భయ్యా.. కచ్చితంగా నీ పని అయిపోయి ఉండేది. అశూ గనుక మాస్టర్ మైండ్తో ఆడి ఉండకపోతే.. నీకు మాములుగా ఉండేది కాదు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Hello Sydney 👋
— BCCI (@BCCI) October 25, 2022
We are here for our 2⃣nd game of the #T20WorldCup! 👏 👏#TeamIndia pic.twitter.com/96toEZzvqe
చదవండి: T20 WC 2022: ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?