ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు కోచింగ్ స్టాప్లో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియాను వీడేందుకు హెడ్కోచ్ గంభీర్ కోటరీలోని ఒకరు సిద్దంగా ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఇందుకు సంబంధించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. "జట్టును వీడబోతున్న ఆ సభ్యుడు మరెవరో కాదు, ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్" అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ నిఖిల్ నాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దిలీప్ కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్లో చేరే అవకాశం ఉందని నిఖిల్ నాజ్ అంచనా వేశాడు.
కాగా హైదరాబాద్కు చెందిన దిలీప్ వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నాడు. తొలుత రాహుల్ ద్రవిడ్ హయంలో ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన దిలీప్.. దాదాపుగా ఐదేళ్ల నుంచి భారత జట్టుతో కొనసాగుతున్నాడు.
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడి కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించలేదు. కానీ విదేశీ కోచ్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికి, సరైన వ్యక్తి దొరకపోవడంతో మళ్లీ దిలీప్నే ఫీల్డింగ్ కోచ్గా భారత క్రికెట్ బోర్డు నియమించింది. అయితే ఈసారి మాత్రం ఫీల్డింగ్ కోచ్గా అతడు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.
తాజాగా భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్లో ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యంత దారుణంగా పడిపోయాయని అతడు మండిపడ్డాడు. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లల సిరీస్లో భారత ఫీల్డర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 6 క్యాచ్లు జారవిడిచారు. అంతకుముందు టీ20 ప్రపంచకప్లోనూ భారత ఫీల్డర్లు 13 క్యాచ్లను విడిచిపెట్టారు.
"ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో భారత్ ఓడిపోవడాన్ని ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. దారుణమైన క్రికెట్ ఆడి సిరీస్ను కోల్పోయారు. అయితే గత రెండేళ్లగా భారత పురుషుల, మహిళల జట్లలో ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి.
ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆ రెండు, మూడు క్యాచ్లు పట్టి ఉంటే వారు 180 ప్లస్ పరుగులు చేసేవారు కాదు. రెండో మ్యాచ్లోనూ అదే రిపీట్ అయింది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం వల్ల భారత్ మ్యాచ్లను చేజార్చుకుంటోంది" అని పటేల్ పేర్కొన్నాడు.


