భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలు
అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.
పాక్ బోర్డు డ్రామాలు
కానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.
తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
పాక్ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదు
ఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్ స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు.
కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవస్థ అతలాకుతలం
ఇలాంటి తరుణంలో పాక్ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్- పాక్ మ్యాచ్ వివాదం ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు.


