
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి పదవికి దేవజిత్ సైకియా దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లుగా బోర్డు సెక్రటరీగా పనిచేసిన జైషా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. కాగా ఈ పదవికి శనివారం దేవజిత్ సైకియా దరఖాస్తు చేసుకున్నారు.
గత నెల రోజులుగా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సైకియా... ఇక పూర్తిస్థాయి అధికారాలు చేపట్టనున్నారు. అలాగే కోశాధికారి పదవికి ప్రభ్తేజ్ భాటియా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పదవులకు వీరిద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో ఎంపిక ఏకగ్రీవం కానుంది. గతంలో ట్రెజరర్గా బాధ్యతలు చేపట్టిన ఆశిశ్ షెలార్... మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు.