విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్‌ 1గా యువ సంచలనం | Sakshi
Sakshi News home page

D Gukesh: విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్‌ 1గా యువ సంచలనం

Published Fri, Sep 1 2023 5:20 PM

D Gukesh Replaces Viswanathan Anand India Top Chess Player After 37 Years - Sakshi

D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్‌మాస్టర్‌ డి గుకేశ్‌ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్‌ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్‌ 1గా కొనసాగుతున్న ఆనంద్‌ను గుకేశ్‌ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

తాజా ఫిడే ర్యాంకింగ్స్‌(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్‌ మాస్టర్‌ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్‌ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ అయిన విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

37 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో తన మెంటార్‌ ఆనంద్‌ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్‌ భారత్‌ తరఫున నెంబర్‌ 1 ర్యాంకర్‌గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్‌ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్‌ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్‌ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్‌కప్‌-2023 రన్నరప్‌గా నిలిచిన ఆర్‌ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్‌ తరఫున టాప్‌-3లో నిలిచాడు.

ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్‌ సంతోష్‌ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్‌ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్‌-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్‌ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్‌కప్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్‌ చేరిన విషయం విదితమే.

చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే 

Advertisement
Advertisement