
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్లు (పంజాబ్, గుజరాత్, ఆర్సీబీ, ముంబై) ఇదివరకే ఖరారయ్యాయి. క్వాలిఫయర్-1 (పంజాబ్), ఎలిమినేటర్ (ముంబై) మ్యాచ్ల్లో కూడా ఒక్కో బెర్త్ ఖరారైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన జట్లు (సీఎస్కే, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, లక్నో, ఢిల్లీ) తదుపరి సీజన్లో మరింత బలంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాయి. కొన్ని జట్లు తదుపరి సీజన్లో ఎవరిని వదిలించుకోవాలో, ఎవరిని అట్టిపెట్టుకోవాలో అన్నదానిపై ఇప్పటికే ఓ అంచనా కలిగి ఉన్నాయి.
ఆటగాళ్ల రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే వెటరన్ ఆటగాళ్ల ప్రస్తావన వస్తుంది. కొందరు వెటరన్లు లీగ్ ప్రారంభం నుంచి ఆడుతూ ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో కొందరకి ఈ సీజన్ ఆఖరిదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.
ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే ఆటగాళ్ల ప్రస్తావన వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ధోని. 44 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమైనా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోనికి ఈ సీజన్ ఆఖరిదని చాలామంది అంటున్నారు. ధోని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రిటైర్ కానని కూడా ఖరాఖండిగా చెప్పలేదు. ధోని ఈ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్గా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై వయోభారం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. 39 ఏళ్ల అశ్విన్ను ఈ సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే యాష్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. కుర్ర విధ్వంసకర బ్యాటర్ల ముందు అతని మాయాజాలం పని చేయలేదు. జట్టు నుంచి స్వతహాగా వైదొలగాలని సొంత జట్టు అభిమానులే కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పడం గ్యారెంటీ అని తెలుస్తుంది.
ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్. ఫాఫ్ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు ధరకే సొంతం చేసుకుంది. వయసు మీద పడటంతో ఫాఫ్ మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. అందుకే అతన్ని ఆర్సీబీ వదిలించుకుంది. 40 ఏళ్ల ఫాఫ్ కుర్ర బ్యాటర్లతో పోటీపడి గతంలోలా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. వాస్తవానికి ఆర్సీబీ వదిలించుకున్నప్పుడే అతని పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ ఏదో ప్రణాళికతో అతన్ని దక్కించుకుంది. తీరా అది కూడా ఫ్లాప్ అయ్యింది.
ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ. త్వరలో 38లో అడుగుపెట్టనున్న మొయిన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని టాక్ నడుస్తుంది. ఈ సీజన్లో మొయిన్ను కేకేఆర్ నామమాత్రపు ధరకు సొంతం చేసుకుంది. మొయిన్ ఫ్రాంచైజీ నమ్మకానికి వంద శాతం న్యాయం చేయలేకపోయినా, పర్వాలేదనిపించాడు. మొయిన్ విదేశీ లీగ్లపై దృష్టి పెట్టేందుకు తనకు పెద్దగా డిమాండ్ లేని ఐపీఎల్ను వదిలేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా విజయ్ శంకర్ (సీఎస్కే), మోహిత్ శర్మ (ఢిల్లీ), అజింక్య రహానే (కేకేఆర్) కూడా ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పవచ్చని టాక్ నడుస్తుంది.