శెభాష్‌ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో | Chess Olympiad: Indian in with a chance for historic twin gold | Sakshi
Sakshi News home page

శెభాష్‌ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో

Sep 22 2024 9:38 AM | Updated on Sep 22 2024 10:45 AM

Chess Olympiad: Indian in with a chance for historic twin gold

    ఒలింపియాడ్‌ అగ్రస్థానం దిశగా భారత పురుషుల జట్టు  

    పదో రౌండ్‌లో అమెరికాపై ఘనవిజయం

ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ స్వర్ణ చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. మన గ్రాండ్‌మాస్టర్లు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నా అందని ద్రాక్షగానే ఉన్న బంగారు పతకం ఎట్టకేలకు దక్కే అవకాశం వచి్చంది. టోర్నీ చరిత్రలో తొలిసారి భారత పురుషుల జట్టు విజేతగా నిలవడం దాదాపుగా ఖాయమైంది. అడుగడుగునా హేమాహేమీ గ్రాండ్‌మాస్టర్లు,  క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైన ఈ మెగా టోరీ్నలో మన ఆటగాళ్లు చిరస్మరణీయ విజయం సాధించారు. పది రౌండ్ల తర్వాత 19 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలవగా చైనా ప్రస్తుతం 17 పాయింట్లతో ఉంది. చివరి రౌండ్‌లో భారత్‌ ఓడి చైనా గెలిస్తేనే ఇరు జట్ల సమమై టై బ్రేక్‌కు దారి తీస్తుంది. అయితే మన టీమ్‌ ప్రస్తుత ఫామ్‌ చూస్తే ఓటమి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి  స్వర్ణం లాంఛనమే కావచ్చు.  

బుడాపెస్ట్‌: ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత పురుషుల జట్టు  పది రౌండ్ల తర్వాత అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ కీలకమైన ఆఖరి పోరులో విజయం సాధించడంతో భారత్‌కు పసిడి దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ఆర్‌. ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత్‌ బృందం మరో రౌండ్‌ మిగిలుండగానే విజేతగా మారే స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా ఆడిన పది రౌండ్లలో ఏకంగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఒక్క 9వ రౌండ్‌లో మాత్రం ఉజ్బెకిస్తాన్‌ భారత్‌ను డ్రాలతో నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్‌ 2–2తో ‘టై’గా ముగిసింది. 

శనివారం జరిగిన పదో రౌండ్లో భారత ఆటగాళ్లు 2.5–1.5తో అమెరికాను ఓడించారు. దీంతో భారత్‌ 19 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆఖరిరౌండ్‌ ఉన్నప్పటికీ భారత్‌ను చేరుకునే జట్టే లేకపోవడంతో పసిడి పతకం వశమైంది. దొమ్మరాజు గుకేశ్‌...ఫాబియానో కరువానాపై గెలిచి మంచి ఆరంభమిచ్చాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో ఆర్‌.ప్రజ్ఞానంద... వెస్లి సో చేతిలో ఓడిపోవడంతో స్కోరు సమమైంది. ఈ దశలో విదిత్‌ గుజరాతి... లెవొన్‌ అరోనియన్‌తో గేమ్‌ డ్రా చేసుకోవడంతో మరోసారి 1.5–1.5 వద్ద మళ్లీ స్కోరు టై అయ్యింది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్‌ ఇరిగేశి అర్జున్‌... లినియార్‌ పెరెజ్‌పై గెలుపొందడంతో భారత్‌ ఈ టోరీ్నలో తొమ్మిదో విజయాన్ని సాధించింది. 

మహిళల విభాగంలో భారత బృందం చెప్పుకోదగ్గ విజయం సాధించింది. చదరంగ క్రీడలో గట్టి ప్రత్యర్థి అయిన చైనాకు భారత మహిళల బృందం ఊహించని షాకిచి్చంది. భారత్‌ 2.5–1.5తో చైనాను కంగుతినిపించింది. సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక... జూ జినర్‌తో, వంతిక అగర్వాల్‌... ల్యూ మియోయితో డ్రా చేసుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్‌... ని షిఖన్‌ను ఓడించడంతో భారత్‌ విజయానికి బాటపడింది. ఆఖరి మ్యాచ్‌లో వైశాలి... గ్యూ కి గేమ్‌ డ్రా కావడంతో చైనా కంగుతింది. చివరిదైన 11వ రౌండ్‌ తర్వాతే మహిళల జట్టు స్థానం 
ఖరారవుతుంది.  

   

Advertisement
 
Advertisement
Advertisement