టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్ల హవా పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ ఫార్మాట్ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు రావాలని ఈ మాజీ పేసర్ పిలుపునిచ్చాడు. గాలే వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘోర ఓటమి అనంతరం వాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం ఏదో ఒకటి చేయాలి. ఐసీసీ, అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కలిసికట్టుగా పనిచేయకపోతే టెస్ట్ క్రికెట్ పూర్తిగా కనమరుగు అవుతోంది. కేవలం టెస్టు ఫార్మాటే కాదు వన్డే క్రికెట్ పరిస్థితి కూడా అంతే. ప్రతీ క్రికెటర్ మూడు ఫార్మాట్లలోనూ రాణించలేడు.
టెస్టు క్రికెట్కు సరిపోయే ఆటగాళ్లను గుర్తించి, వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల మ్యాచ్లను పెంచాలి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా చమిందానే కాదు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా టెస్టు క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఐసీసీ 2019లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పేరిట సరికొత్త టోర్నీని తీసుకొచ్చింది. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో సంప్రాదాయ క్రికెట్ను ఆదరించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
చదవండి: BAN vs AUS: స్టీవ్ స్మిత్ తొండాట.. వార్నింగ్ ఇచ్చిన అంపైర్


