టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా చేతన్‌ శర్మ.. బీసీసీఐ ప్రకటన

BCCI Announces Senior Men Selection Committee Chetan Sharma Lead - Sakshi

భారత క్రికెట్‌ జట్టు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేతన్‌ శర్మ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి శనివారం వెల్లడించింది. చేతన్‌తో పాటు ఈ సెలక్షన్‌ కమిటీలో శివ్‌ సుందర్‌ దాస్‌, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌ శరత్‌కు చోటు దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చేతన్‌ శర్మ చైర్మన్‌గా ఉన్న కమిటీని రద్దు చేసి ఖాళీ స్థానాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మరోసారి చేతన్‌ శర్మ వైపే మొగ్గు చూపిన బీసీసీఐ పెద్దలు అతడిని అప్లై చేసుకోవాల్సిందిగా సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపేలతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఆలిండియా మెన్‌ సెలక్షన్‌ కమిటీని ఖరారు చేసింది.

నవంబరు 18న 5 పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేసినట్లు పేర్కొంది. వీరిలో 11 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసి చివరగా కావాల్సిన ఐదుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్‌ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.
చదవండి: కొంచెం‍ చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్‌ మధ్యలోకి! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top