మెయిన్‌ ‘డ్రా’కు ఆయుశ్‌ శెట్టి అర్హత | Ayush Shetty qualifies for Swiss Open main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు ఆయుశ్‌ శెట్టి అర్హత

Mar 19 2025 3:45 AM | Updated on Mar 19 2025 3:45 AM

Ayush Shetty qualifies for Swiss Open main draw

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ముగ్గురు క్రీడాకారులు ఆయుశ్‌ శెట్టి, శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్, సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ పోటీల్లో ఆయుశ్, శంకర్, సతీశ్‌ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెయిన్‌ ‘డ్రా’ బెర్త్‌లను దక్కించుకున్నారు. 

ఆయుశ్‌ తొలి రౌండ్‌లో 21–12, 21–15తో చోలన్‌ కయాన్‌ (ఇంగ్లండ్‌)పై, రెండో రౌండ్‌లో 21–6, 21–8తో రాఫెల్‌ గావోఇస్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. శంకర్‌ తొలి రౌండ్‌లో 21–13, 21–4తో యువెహాంగ్‌ వాంగ్‌ (ఇంగ్లండ్‌)పై, రెండో రౌండ్‌లో 21–7, 21–10తో తరుణ్‌ మన్నేపల్లి (భారత్‌)పై నెగ్గాడు. 

సతీశ్‌ తొలి రౌండ్‌లో 21–13, 21–9తో బ్రూనో కర్వాలో (పోర్చుగల్‌)పై, రెండో రౌండ్‌లో 19–21, 21–19, 21–16తో జస్టిన్‌ హో (మలేసియా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువా మెయిన్‌ ‘డ్రా’కు చేరుకోగా... శ్రియాన్షి వలిశెట్టి విఫలమైంది. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో ఇషారాణి 21–16, 21–11తో రోసీ పాన్‌కసారి (ఫ్రాన్స్‌)పై గెలుపొందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement