Virat Kohli Gym Video: జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్‌! కింగ్‌.. ఒక్క సెంచరీ ప్లీజ్‌!

Asia Cup 2022: Virat Kohli Hardcore Gym Session Video Goes Viral - Sakshi

Virat Kohli Gym Video Viral: ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆసియా కప్‌-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో జట్టుతో కలవనున్నాడు. ఈ క్రమంలో ఈ స్టార్‌ బ్యాటర్‌ ఇప్పటికే ప్రాక్టీసు​ మొదలుపెట్టాడు. 

ఇటీవల ముంబైలోని బికేసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న కోహ్లి.. తాజాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్‌ చేశాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌తో పాటు... కఠిన వ్యాయామాలు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించేందుకు కష్టపడుతున్నాడు. 

ఈ మేరకు జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లిని చూసిన అభిమానులు.. 71వ సెంచరీ చేసేందుకు కింగ్‌ సన్నద్ధమవుతున్నాడంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తే చూడాలని ఉందని.. దాయాదిపై శతకం బాది తమ ఆశను నెరవేర్చాలంటూ కోహ్లికి విజ్ఞప్తి చేస్తున్నారు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయిన విషయం తెలిసిందే!

పూర్వ వైభవం తిరిగి పొందేనా!
గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో కోహ్లి విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత ఏ ఇతర సిరీస్‌కు కోహ్లిని ఎంపిక చేయలేదు సెలక్టర్లు. చాలా రోజుల పాటు అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో తాజాగా మెగా ఈవెంట్‌​కు ఎంపికైన కోహ్లి.. సరికొత్త ఉత్సాహంతో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీతోనైనా తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడని ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వేళ పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సన్నద్ధమవుతున్నాడు. 

అద్బుతమైన రికార్డు!
ఇక ఆసియా కప్‌ టోర్నీలో కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. 2010లో ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఈ రన్‌మెషీన్‌ వన్డే ఫార్మాట్‌లో 766 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టోర్నీ టీ20 ఫార్మాట్‌కు మారిన తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌లలో 153 పరుగులు చేశాడు. కాగా ఈసారి ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

మరింత ప్రత్యేకం.. ఎందుకంటే!
ఆ మరుసటి రోజు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. కోహ్లికి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు బాదిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మరో శతకం సాధించి దీనిని మరింత ప్రత్యేకం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కోహ్లి తాజాగా షేర్‌ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. గంటలోపే లక్షా ఇరవై వేలకు పైగా వ్యూస్‌ సాధించింది.

చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..!
NZ vs WI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే‍.. ఆరేళ్ల తర్వాత విండీస్‌ ఆటగాడు రీ ఎంట్రీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top