నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..! | Ashish Nehra Declines Team India T20 Coach Offer, BCCI Again In Contact With Dravid, Says Sources - Sakshi
Sakshi News home page

నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..!

Nov 29 2023 11:41 AM | Updated on Nov 29 2023 12:32 PM

Ashish Nehra Declines Team India Coach Offer, BCCI Again In Contact With Dravid - Sakshi

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం ప్రపంచకప్‌-2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత కోచ్‌గా మరో దఫా కొనసాగాలని బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు. స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఫుల్‌ టైమ్‌ కోచ్‌ వేటలో నిమగ్నమై ఉంది. 

ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాను కలిశారు. భారత్‌ జట్టు కోచింగ్‌ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తన ఐపీఎల్‌ కమిట్‌మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని చెప్పినట్లు వినికిడి. దీంతో గత్యంతరం లేక బీసీసీఐ మళ్లీ ద్రవిడ్‌నే సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత​ కోచ్‌గా వ్యవహరించాలని ద్రవిడ్‌కు కబురు పంపారని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతనికి వీసా కూడా తీశారని సమాచారం. 

ఒకవేళ ద్రవిడ్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఓకే చెబితే కోచింగ్‌ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్‌ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement