నిఖత్‌ ‘డబుల్‌’ ధమాకా | Sakshi
Sakshi News home page

నిఖత్‌ ‘డబుల్‌’ ధమాకా

Published Sat, Sep 30 2023 2:25 AM

Along With The Medal, The Paris Olympics Berth Is Finalized - Sakshi

న పంచ్‌ పవర్‌ ఎలా ఉంటుందో భారత మహిళా స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి చాటుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి పాల్గొంటున్న ఈ తెలంగాణ బాక్సర్‌ 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ కేవలం 53 సెకన్లలో రిఫరీ స్టాప్స్‌ కంటెస్ట్‌ (ఆర్‌ఎస్‌సీ) పద్ధతిలో విజయాన్ని అందుకుంది.

హనన్‌ నాసర్‌ (జోర్డాన్‌)తో జరిగిన ఈ బౌట్‌లో నిఖత్‌ సంధించిన పంచ్‌లకు ఆమె ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. దాంతో మూడు నిమిషాల నిడివి గల తొలి రౌండ్‌లో 53 సెకన్లు ముగియగానే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది బర్మింగ్‌హమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో.. 2022, 2023 ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన నిఖత్‌ ఆసియా క్రీడల పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది.

‘క్వార్టర్‌ ఫైనల్లో గెలవడంతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే’ అని 27 ఏళ్ల నిఖత్‌ వ్యాఖ్యానించింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో చుథామట్‌ రక్సత్‌ (థాయ్‌లాండ్‌)తో నిఖత్‌ తలపడుతుంది. మరోవైపు 57 కేజీల విభాగంలో పర్వీన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా.. పురుషుల 80 కేజీల విభాగంలో లక్ష్య చహర్‌ ఓడిపోయాడు. పరీ్వన్‌ 5–0తో జిచున్‌ జు (చైనా)పై నెగ్గగా... లక్ష్య చహర్‌ 1–4తో ఒముర్‌బెక్‌ (కిర్గిస్తాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement