ప్రతిష్టాత్మక జూనియర్ డేవిస్కప్ వరల్డ్ టీమ్ టెన్నిస్ ఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) జూనియర్ బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్లో టాప్–3లో ఉన్న తవీష్ పహ్వా (హరియాణా), రిభవ్ సరోహ (చండీగఢ్), హృతిక్ కటకం (తెలంగాణ) ఈ మెగా టోర్నిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. కోచ్గా కర్ణాటకకు చెందిన రాణా బెనర్జీ వ్యవహరిస్తారు. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈ టోర్నీ జరగనుంది.
భారత్తోపాటు ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఈజిప్్ట, స్పెయిన్, ఫ్రాన్స్, హంగేరి, ఇటలీ, జపాన్, కజకిస్తాన్, మొరాకో, సెర్బియా, అమెరికా, వెనిజులా జట్లు ఈ టోర్నిలో పాల్గొంటాయి. ఈ ఏడాది మే నెలలో కజకిస్తాన్లో జరిగిన ఆసియా–ఓసియానియా క్వాలిఫయింగ్ టోర్నిలో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా భారత జట్టు డేవిస్కప్ ఫైనల్స్ టోర్నికి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నిలోనూ తవీష్, రిభవ్, హృతిక్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 16 ఏళ్ల హృతిక్ జూనియర్
సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్నాడు. గత నెలలో ఈజిప్్టలో జరిగిన ఐటీఎఫ్ జె100 డకాలియా టోర్నీ సింగిల్స్ విభాగంలో హృతిక్ రన్నరప్గా నిలిచాడు.


