
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ క్వాలిఫయర్స్ కు ముందు నిర్వహించనున్న జాతీయ శిబిరానికి 39 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. జూన్, జూలైలో జరగనున్న ఈ అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా... జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టీమ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రీ శనివారం 39 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ ప్రాబబుల్స్లో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ చోటు దక్కించుకుంది.
ఇటీవల ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తరఫున 9 గోల్స్తో సత్తాచాటిన సౌమ్య... ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 33 మ్యాచ్లాడింది. మహిళల ఆసియాకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీకి థాయ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 23 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది.
ఆతిథ్య థాయ్లాండ్, మంగోలియా, టిమొర్ లెస్ట్, ఇరాక్తో భారత జట్టు తలపడుతుంది. దానికి ముందు భారత ప్లేయర్ల కోసం మే1 నుంచి బెంగళూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. సీనియర్ ప్లేయర్లు బాలా దేవి, ఆశాలత దేవికి ఈ ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. ఇటీవల ఐడబ్ల్యూఎల్లో రాణించిన యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి.
ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ చాను, కైశమ్ మెలోడీ చాను, మోనాలిసా దేవి (గోల్ కీపర్స్), పూర్ణిమ కుమారి, నిర్మలా దేవి, మార్టినా థోక్చమ్, శుభాంగి సింగ్, సంజూ, మాలతీ, టోయిజమ్ చాను, రంజనా చాను, స్వీటి దేవి, విక్సిత్ బారా, షిల్కీ దేవి (డిఫెండర్స్), కిరణ్, రత్నబాలా దేవి, ముస్కాన్, బబీనా దేవి, కార్తీక అంగముత్తు, కోల్నీ, సంగీత, ప్రియదర్శిని, బేబే సనా, సంతోష్, అంజూ తమాంగ్ (మిడ్ఫీల్డర్స్), మౌసుమీ ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాజన, లిండా కామ్, రింపా హల్దార్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సుమతి, మనీషా, గ్రేస్ డాంగ్మెయి (ఫార్వర్డ్స్).