జిల్లా వ్యాప్తంగా 3.36 లక్షల కార్డులు
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
రేపు సిద్దిపేటలో కార్డులు పంపిణీ చేయనున్న మంత్రి పొన్నం
రేషన్ పంపిణీలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే సరుకుల పంపిణీలో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఈ పాస్ను అమలు చేస్తోంది. కొన్నేళ్లుగా రేషన్ కార్డులు పేపర్పై ప్రింట్తోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఏటీఎం కార్డు తరహాలో రూపొందించిన స్మార్ట్ కార్డులను అందించనుంది. వీటిని ఆగస్టు 15న అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
– సాక్షి, సిద్దిపేట
ఇప్పటి వరకు రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు వీటిని ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని లబ్ధిదారులు వినియోగించుకునేవారు. పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తోంది. అయితే ఈ కాగితం స్థానంలో స్మార్ట్ కార్డు తరహాలో తయారు చేసి అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్తగా అందజేసే కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్ కార్డు నంబర్ ముద్రించారు. కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ రేషన్ షాప్లోనైనా బియ్యం తీసుకోవచ్చు. క్యూర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సైతం తెలుసుకోవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు ఆకర్షణీయంగా ఉంది.
15 నుంచి లబ్ధిదారుల చేతికి..
స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజున మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట పట్టణంలో ఆర్యవైశ్య సంక్షేమ భవనంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
జిల్లాకు చేరిన కార్డులు
ప్రభుత్వం అందించే స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,36,869 రేషన్ కార్డులున్నాయి. ఆధునిక సాంకేతిక కార్డు ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం...
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. జిల్లాకు స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకున్నాయి. ఈనెల 15న మధ్యాహ్నం 2గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నాం.
–తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట


