● మల్లన్న ఆలయంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): నిత్యం వేలాది మంది దర్శించుకునే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు రక్షణ కరువైంది. ఆలయలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదు. ఏటా వాటి నిర్వహణకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఆలయ అధికారులు నిర్వహణపై సరియైన దృష్టి సారించడంలేదు. ఆలయంతో మొత్తం 40 సీసీ కెమెరాలు ఉండగా, ఆలయ పరిసరాలలో 32 కెమెరాలు, హుండీ లెక్కింపు జరిగే ముఖమండపంలో 8 కెమెరాలు ఉన్నాయి. వాటితో ఆలయ పరిసారాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. కానీ కొందరి అధికారుల పని తీరుతో వాటిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆన్నదాన సత్రం, భక్తుల రద్దీగా ఉండే ప్రాంతాలలో, ఆలయంలో కొన్ని కెమెరాలతో పాటు డీవీఆర్ పనిచేయడం లేదు. దీంతో ఆలయానికి భద్రత, భక్తుల రక్షణ కరువైంది. వెంటనే పని చేయని సీసీ కెమెరాలు బాగు చేయించి భక్తుల రక్షణ, ఆలయానికి భద్రత కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా సీసీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయం మాదృష్టికి వచ్చిందన్నారు. వాటిని రిపేర్ చేయించేందుకు టెండర్ పిలుస్తున్నమని, త్వరలోనే అన్ని సీసీ కెమెరాలు పని చేసేవిధంగా చూస్తామని తెలిపారు.


