జడ్జి రేవతి
హుస్నాబాద్: ప్రస్తుత సమాజంలో మానవ విలువలు, నైతికతను పెంపొందించే విద్య అవసరమని హుస్నాబాద్ ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ జడ్జి రేవతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రేవతి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, భాషను అందరు గౌరవించాలన్నారు. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో అదనపు జడ్జి ప్రమీద, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, పాఠశాల అద్యాపక బృందం పాల్గొన్నారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకం చేపడితే లాభాలు గడించవచ్చని ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఏడీ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం చంద్లాపూర్, గంగాపూర్లో పట్టు పురుగుల షెడ్లను, తోటలను, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకం చేపడితే నెల నెలా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. మల్బరీ సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు పట్టు రైతులు పాల్గొన్నారు.
చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో దళితుల ఇళ్ల కూల్చివేతను ఆపాలంటూ పలువురు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడినట్లు వారు తెలిపారు. కమిషన్ను కలిసిన వారిలో బాధితులు వెంకటేశం, అంజయ్య, గునిగంటి శివ తదితరులున్నారు.
హుస్నాబాద్రూరల్: మండల పరిధి మాలపల్లి, కూచనపెల్లి గ్రామాల మధ్య మర్రివాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసింది. శుక్రవారం రైతులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు ఆధ్వర్యంలో వాగు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు మెరుగు పడతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, కాంగ్రెస్ నాయకులు చందు, బొమ్మగాని రాజ్కుమార్, మహేందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు(సిద్దిపేట): ట్రైబల్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) తెలంగాణ చాప్టర్ జిల్లా కోఆర్డినేటర్గా బుక్యా భిక్షపతినాయక్ నియమితులయ్యారు. నంగునూరు మండలం జేపీతండా సర్పంచ్గా, జిల్లా బంజారా కమిటీ సభ్యునిగా పని చేసిన భిక్షపతినాయక్కు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్ నియామక పత్రం అదజేశారు. భిక్షపతినాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు.


