ఆగ్రో సేవా కేంద్రంలో అమ్మకాలు
నిలిపివేయించిన అధికారులు
రామాయంపేట(మెదక్): అధిక ధరలకు కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తున్న ఓ ఫర్టిలైజర్ దుకాణంపై వ్యవసాయ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేసి, అమ్మకాలను నిలిపివేయించారు. కాంప్లెక్స్ ఎరువుల ఽబస్తా ధర రూ.1350 ఉండగా, స్థానిక ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రూ. 2120కి అమ్ముతున్నట్లు కొందరు రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ జరిపిన మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ అమ్మకాలను నిలిపివేయించారు. ఈ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వాహనం సీజ్
కోహెడరూరల్(హుస్నాబాద్): అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిలాష్ వివరాల ప్రకారం.. రామంచ నుంచి కోహెడకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాగా సింగరాయ పెట్రోల్ పంప్ దగ్గర బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు తరలిస్తున్న ఇసుకకు సంబంధించిన ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోవడంతో వాహనం సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు.
చిన్నశంకరంపేట(మెదక్): వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన రైతుకు ఫిట్స్ రావడంతో పొలంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఖాజాపూర్ గ్రామ పరిధిలోని కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంసాని రామ్రెడ్డి(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పంటపొలంలో బోర్లపడి ఉన్నాడు. వెంటనే అతన్ని పైకిలేపి చూడగా ఫిట్స్తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
రామాయంపేట(మెదక్): మద్యం తాగి డీసీఎం నడిపిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈమేరకు అతన్ని నిజాంపేట పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సదరు వ్యక్తికి న్యాయమూర్తి రూ. 10వేల జరిమానా విధించారని ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిద్దిపేటలో 73మందికి..
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు వివరాలు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో 73మంది పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రూ. 5,49,500 జరిమానా, ఒకరికి పది రోజులు, ఇద్దరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.
హత్నూర(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సిర్పుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని పీరియా తండాకు చెందిన మాలోతు గన్య (55)తన బైక్పై సిరిపురం నుంచి పీర్యతండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేవునిగుట్ట తండాకు చెందిన మడావత్ నవీన్ తన బైక్పై వస్తూ వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో గన్య ను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.


