పటాన్చెరు: ఇంటెలిజెంట్ ఐఓటీ నెట్వర్క్ ఆప్టిమైజేషన్పై పరిశోధన చేసిన ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి యన్నం భరత్ భూషణ్ పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారు. ‘ఐఓటీ నెట్వర్క్లో ఉమ్మడి వనరుల కేటాయింపు, రద్దీ–అవగాహన హైబ్రిడ్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు’ అంశంపై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినట్లు గైడ్ డాక్టర్ అపర్ణ తెలిపారు. మెటాహ్యూరిస్టిక్ అల్గారిథమ్లు, క్రాస్–లేయర్ ఆప్టిమైజేషన్, ఎడ్జ్–ఫాగ్–క్లౌడ్ కంప్యూటింగ్ సమన్వయంతో లేటెన్సీ తగ్గించి, నెట్వర్క్ జీవితకాలాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. భరత్ను గీతం అధికారులు, అధ్యాపకులు అభినందించారు.
పాపం చిన్నారి..
పాత తలుపుల రూపంలో
కబళించిన మృత్యువు
వెల్దుర్తి(తూప్రాన్): అప్పటి వరకు ఇంటి ముందు తోటి పిల్లలతో సరదాగా ఆడుకున్న చిన్నారి.. కాసేపటికే విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. పంచాయతీ కార్మికుడు యేసు కుమార్తె అలేఖ్య (7) సోమవారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే పక్కన ఉంచిన పాత తలుపు, డోర్ ఫ్రేమ్ను ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నించింది. ఒక్కసారిగా ఆ తలుపు, ఫ్రేమ్తో సహా చిన్నారిపై పడటంతో ముఖాని కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను తూప్రా న్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకు న్న కుమార్తె అనూహ్యంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.
భద్రాచల రామయ్య
తలంబ్రాల పంపిణీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): భద్రాచల సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలను సోమవారం, జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో భక్తులకు పంపిణీ చేశారు. సిద్దిపేట నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలను భక్తులు భద్రాచలం ఆలయానికి పంపించగా, ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం నుంచి సిద్దిపేటకు 100కిలోల ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయ ద్వారానికి
స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ది చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రధాన ద్వారాలకు స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కోనేరు పక్కనున్న, కొండపైన కొలువైన స్వామివారి గర్భాలయాకు జీడిపల్లి వాసి దోమకొండ వెంకటరమణ స్టీల్ గ్రిల్స్ను ఏర్పాటు చేయించారు. ఆలయ అభివృద్ధికి దాతలు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఆలయ ఈఓ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు ధనుంజయ్శర్మ కోరారు.
మర్రికుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని హనుమతండా గ్రామ పంచాయతీ పరిధి లో గల మర్రికుంట నుంచి కొంత మంది అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం అక్రమ మట్టి తరలింపుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి మాట్లాడుతూ.. ఓ ఇటుక వ్యాపారి తన స్వలాభం కోసం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తీస్తున్నట్లు తెలిపారు. అధికారుల అండదండలతోనే మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


