చిలప్చెడ్(నర్సాపూర్): మొబైల్స్లో వచ్చే అనవసర లింక్లను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల మాయలో పడొద్దని ఎస్ఐ నర్సింహులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీ విద్యార్థులకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, షీటీం, పోక్సో తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బ్యాంకు ఖాతా, ఓటీపీలు, వ్యక్తిగత వివరాల కోసం ఎవరైనా కాల్ చేస్తే, వారికి ఎలాంటి వివరాలు ఇవ్వొద్దని సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని, తప్పనిసరిగా వారికి ఫోన్ ఇవ్వాల్సి వస్తే తల్లితండ్రుల సమక్షంలోనే ఇవ్వాలన్నారు. మహిళలను, బాలికలను వేధింపులకు గురిచేస్తే షీటీంను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యుడు సూరి, ఉపాధ్యాయ సిబ్బంది కీర్తి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


