భార్య బలవన్మరణం
కొల్చారం(నర్సాపూర్): కట్టుకున్నవాడు వ్యసనాలకు లోనవడం..చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, తీవ్ర మనస్తాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ హైమద్ మోహినొద్దీన్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోరంపల్లి దుర్గయ్య–లక్ష్మి దంపతుల పెద్ద కూతురు కృష్ణవేణి(38)ని, అదే గ్రామానికి చెందిన డొంకెన కృష్ణతో 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా కృష్ణ ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరిగేవాడు. అక్కడక్కడ అప్పులు సైతం చేశాడు. కృష్ణవేణి కుటుంబ పోషణ కోసం కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కాగా భర్త చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురవుతూ తనలో తాను మదన పడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఉదయం పిల్లలు బయటకు వెళ్లగానే కృష్ణవేణి ఇంట్లోని దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యాపారం నడవకపోవడంతో..
జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. ఐడీఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్న కచేరి తాజోద్దీన్(41)డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫైనాన్స్లో అప్పు చేసి బొలెరో కొనుగోలు చేశాడు. వ్యాపారం లేక చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న ఎండీ. గౌసోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


