జిల్లాలో వరి పొలాల్లో హైడ్రోజన్ సల్ఫైడ్ దుష్ప్రభావం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డా. పల్లవి
దుబ్బాకటౌన్: ఎరువులను అధికంగా వినియోగిస్తే అనర్థాలు తప్పవంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇష్టం వచ్చినట్లు రసాయన ఎరువులను చల్లడం, పిచికారీ చేయడం, వరి పొలాల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండటం, నేలలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో హైడ్రోజన్ సల్ఫైడ్ దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉందని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. పల్లవి రైతులకు సూచనలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 1,86,319 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో జిల్లాలో వరి పంటలో హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. వానాకాలం, వేసవిలో ఒకే పొలంలో ఏళ్ల తరబడి వరి సాగు చేయడంతో వరిలో ‘‘సల్ఫైడ్’’ దుష్ప్రభావం కనిపిస్తుంది. దీని వల్ల 30 నుంచి 50 శాతం వరకు పంట దిగుబడి రైతులు నష్టపోతున్నారు. దీంతో హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ లక్షణాలను అధికారులు గుర్తించి, రైతుల సమస్యకు గల కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తున్నారు.
నివారణ చర్యలు
పొలంలో నీటిని 3 నుంచి 5 రోజుల పాటు పూర్తిగా తొలగించాలి. నేలకు గాలి తగిలేలా చేసి, 2–3 సెం.మీ. పలుచటి నీటి పొర మాత్రమే ఉండేలా చూడాలి. పొటాష్ ఎరువును సిఫార్సు మేరకు వినియోగించాలి. జింక్ లోపం ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. వేర్లు దెబ్బతినడం వల్ల పోషకాలు సక్రమంగా తీసుకోలేని పరిస్థితిని అధిగమించేందుకు 19:19:19, ఫార్ములా–4 ఎరువులను ఎకరానికి 600 నుంచి వెయ్యి గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి, 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు.
రసాయన ఎరువులతో చౌడుగా మారుతున్న నేలలు


