● 44వ జాతీయ రహదారి దండుపల్లి వద్ద ప్రమాదం ● మృతులు ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీలు
తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీలు తన్మన్ (20), కమలేశ్(22), విశాల్ ముగ్గురు స్నేహితులు. దండుపల్లి శివారులో ఏపీఎంఎల్ పరిశ్రమలో పని చేస్తూ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. సొంత పనులపై స్కూటీపై దండుపల్లికి వచ్చారు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ముందు ఉన్న తన్మన్, కమలేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెనుకాల కూర్చున్న విశాల్ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంను విశాల్ తన్మన్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని తమ సొంత గ్రామాలకు కుటుంబ సభ్యులు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
బస్సు తల పైనుంచి వెళ్లడంతో..
పటాన్చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం బుందిల్ గొల గ్రామానికి చెందిన ఒహిదుల్ ఇస్లాం, సమీనా బేగం (20)ను 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా బతుకుదెరువు కోసం వచ్చి సంగారెడ్డి జిల్లా..కంది మండలంలోని పెద్దనూరు గ్రామం ఉప్పుగడ్డ తండాలో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో ఇద్దరు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సమీనా బేగం, మరో మహిళ షూర్జ బేగంతో కలిసి పరివార్ దాబా వద్ద ఆటో ఎక్కి ఇస్నాపూర్ మార్కెట్కు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో చివరకు కూర్చున్న సమీనా బేగం కళ్లు తిరిగి జాతీయ రహదారిపై పడిపోయింది. దీంతో గుర్తుతెలియని బస్సు ఆమె తల పైనుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆటో ఢీకొని యువకుడి..
జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మనియార్పల్లి గ్రామానికి చెందిన బేగరి జగన్నాథం(23) వెంకటాపూర్ గ్రామంలోని వీఎస్టీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని తన బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని వెంటనే జహీరాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


