కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు అలుగు పైనుంచి శనివారం భారీగా వరద నీరు ప్రవహించింది. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లకు చేరిందని ఏఈ మల్లేశ్ తెలిపారు. ఇన్ఫ్లో 4,260 క్యూసెక్కులు వరద నీరు వస్తుందని, ఔట్ఫ్లో 4,139 క్యూసెక్కులు నీరు అలుగు పైనుంచి పారుతుందని తెలిపారు. కుడి కాల్వ నుంచి 95 క్యూసెక్కులు, ఎడమ కాల్వ నుంచి 26 క్యూసెక్కులు సాగు కోసం విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాల వరకు పంటలు సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.


