సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయా పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ...గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల మూసివేతను ఆపాలని, సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 19న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. 29న చలో హైదరాబాద్ పేరిట జరిగే మహా ధర్నా ఉపాధ్యాయులు భారీ ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిలు,సైమన్, రాజు, షకీల్ అహ్మద్, సిరాజ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


