తూప్రాన్: నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఐటీసీ కంపెనీ సహకారంతో మనోహరాబాద్ మండలం కూచారంలో, బంగారమ్మ టెంపుల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, 2 ఏఏన్పీఆర్ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించవచ్చని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజాగౌడ్, సందీప్ రెడ్డి, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సర్పంచ్ చిత్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మి నర్సింహ్మగౌడ్, పాలకవర్గ సభ్యులు, ఐటీసీ మేనేజర్ ఆనంద్, స్థానికులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు


