ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఒకరు, అప్పులబాధ భరించలేక ఒకరు, జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా..
అనారోగ్యంతో ఒకరు..
ఝరాసంగం(జహీరాబాద్): మండల పరిధిలోని బిడెకన్నె గ్రామానికి చెందిన సంజీవరావు(55) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం సొంత పొలం వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సంధ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో..
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొల్లూర్ గ్రామానికి చెందిన అవుటి వీరన్న(50) చేసిన అప్పులు తీర్చలేక బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల5న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జీవితంపై విరక్తితో..
సిద్దిపేటరూరల్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని తోర్నాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మాసుల కుమార్ (35) మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం బాగాలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


