సంగారెడ్డి జోన్: ప్రజా పంపిణీ వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 20 ఏళ్ల తర్వాత అత్యధిక సాంకేతికతతో కూడిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం చేతుల మీదుగా....
భద్రత ప్రమాణాలతోపాటు ఆకర్షణీయంగా ఏటీఎం కార్డుల సైజులో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం చేశారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డిలో పలువురు లబ్ధిదారులకు డిజిటల్ రేషన్కార్డులు అందించనున్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు
రేషన్ కార్డు లబ్ధిదారుల ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ–కేవైసీ పూర్తయితే స్మార్ట్రేషన్ కార్డులు పొందే వీలుంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90% పైగా ఈ–కేవేసీ పూర్తయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15 వరకు 100% పూర్తయ్య దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పంద్రాగస్టున సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా పంపిణీ
త్వరితగతిన ఈ కేవైసీ పూర్తి చేసే దిశగా చర్యలు
నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
కాగితానికి స్వస్తి చెప్పి ఏటీఎం కార్డు తరహాలో రేషన్కార్డును రూపొందించారు. చినిగిపోకుండా, తడిసిపోకుండా ఉండేవిధంగా భద్రతా ప్రమాణాలతో రూపకల్పన చేశారు. కార్డుకు ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు, కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు ముద్రించారు. మరోవైపు క్యూ ఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. సంబంధిత రేషన్ దుకాణాలకు వెళ్లి స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. త్వరలో ఇదే కార్డుపై బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా రూపకల్పన చేసినట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు 855
ఆహార భద్రతా కార్డులు 4,21,692
అంత్యోదయ కార్డులు 26,664
అన్నపూర్ణ కార్డులు 90
క్యూఆర్ కోడ్తో భద్రం
జిల్లాలోని రేషన్ కార్డుల వివరాలు


