ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు అర్థరహితమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెస్స్(ఏఐ)యుగంలో శరవేగంతో ముందుకు వెళ్తున్న సమయంలో క్షుద్రపూజలు, చేతబడి, మూఢనమ్మకాల గురించి మాట్లాడం శోచనీయమన్నారు. ప్రభుత్వ కూలిపోవాలి, వర్షాలు అడ్డుకోవాలని హరీశ్రావు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యత పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని శిశు గృహ, సఖి కేంద్రాలలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి సంరక్షణకు తోడ్పడాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సఖి కేంద్రాన్ని ఆశ్రయించే వారికి న్యాయపరమైన సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గౌరవధ్యక్షుడిగా శ్రీనివాస్ షెట్కార్
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ షెట్కార్, అధ్యక్షుడిగా కె.బాల్ ఎల్లయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడిగా సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బాలయ్య, సాయాగౌడ్, కార్యదర్శిగా అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా జె.శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కృష్ణ, మహిళా కార్య దర్శిగా రేణుక, ముఖ్య సలహాదారుడిగా భూషణం, సలహాదారుడిగా నాగభూషణం, ప్రచార కార్యదర్శిగా యాదయ్య, కోశాధికారిగా పండరి ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షుడు సిల్వర్ చంద్రశేఖర్
సంగారెడ్డి: ముదిరాజ్ సమాజం ఐక్యంగా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో కూడా విశిష్ట స్థానం సాధించగలదని ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు సిల్వర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ సంఘం భవనంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 9న నిర్వహించనున్న బోనాల మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ సమాజం రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని చెప్పారు. యువత చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.


