నారాయణఖేడ్: అబద్ధాలు చెబుతూ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హితవు పలికారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ హయాంలోనే బోరంచ, గూడూరు, శాపూర్ పథకాల ద్వారా నియోజకవర్గానికి తాగునీటిని అందించే ఏర్పాట్లు దశాబ్దాల కిందటే జరిగిందన్నారు. బీఆర్ఎస్ మిషన్ భగీరథ పేరిట పాత పైపులైన్లు, రోడ్లను తవ్వేసి కొత్తవి వేసి రోడ్లు పూడ్చకపోగా పైపులైన్లు అప్పుడే లీకవడం ప్రారంభించాయని మండిపడ్డారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు అత్యవసరమని 2016లోనే డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా తమ ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తోందని తెలిపారు. అయినా నీటిసమస్య లేకుండా చూడటమే కాకుండా మున్సిపాలిటీ, గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా బోర్లు వేశామని చెప్పారు. బీఆర్ఎస్ నాలుగు విడతల్లో రూ.లక్ష రైతు రుణమాఫీ చేస్తే తమ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. వ్యవసాయ పనిముట్లు, రాయితీ విత్తనాలను బీఆర్ఎస్ సర్కారు నిలిపివేయగా రైతుభరోసా అమలు చేస్తూనే వాటిని పునరుద్ధరించామని గుర్తు చేశారు. భూపాల్రెడ్డికి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగచర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, సీడీసీ మాజీ చైర్మన్ నర్సిహ్మారెడ్డి, తాహెర్అలీ, పండరీరెడ్డి, అశోక్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి


