Iబతుకు పోరులో బహుదూర బాటసారులు I పోటీని ఎదుర్కొంటూ ముందుకు I నేతన్నలకు పథకాలు అంతంతే
భారతీయ సంస్కృతికి, సనాతన సంప్రదాయానికి నిలువుటద్దం మన చేనేత కళ. కాలం మారుతున్నా, ఆధునిక యంత్రాల పోటీ పెరుగుతున్నా.. నేతన్నల చేతి వేళ్ల నైపుణ్యం మగ్గాలపై నేసే వస్త్రాల వైభవమే వేరు. గద్వాల పట్టు, పోచంపల్లి, వెంకటగిరి వెలుగులు.. ఇలా ప్రతి నూలుపోగులోనూ ఒక అద్భుత చరిత్ర దాగి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ స్ఫూర్తిని రగిల్చిన ఆగస్టు 7వ తేదీని పురస్కరించుకుని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కళను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
సిద్దిపేటజోన్: మార్కెట్లో వస్తున్న సాంకేతిక మార్పులకు ధీటు గా నేతన్నలు విభిన్న డిజైన్లలో ముందుకు సాగుతున్నారు. పీతాంబరం, పట్టు, గొల్లభామ, రామప్ప, ముత్యం పేట, గొల్లభామ మామిడి బుట్టలు, లినెన్ చీటికీ, సికో గొల్లభామ, ఆర్ముర్ సిల్క్ లాంటి డిజైన్లలో చీరలు నేసి ఉనికి కాపాడే క్రమంలో నేతన్నలు తాపత్రయ పడుతున్నారు. అయితే రోజంతా పడిన కష్టానికి మాత్రం ఫలితం దక్కడం లేదన్న వ్యథ చేనేత కార్మికుల్లో ఉంది.
దయనీయ స్థితి
సిద్దిపేట చేనేతకు పెట్టింది పేరు. అంతర్జాతీయ స్థాయిలో గొల్లభామ చీరల అద్భుతమైన వృత్తి నైపుణ్యాలను పుణికి పుచ్చుకున్న సిద్దిపేట నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అటు దశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకొని సాగుతున్న నేతన్నలు ఇటు ఇమడలేక, అటు ఎదగలేక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో చేనేతశాఖ రికార్డుల ప్రకారం..18 సొసైటీల్లో అధికారికంగా 2,900 మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ జియోట్యాగ్ నిబంధనల మేరకు జిల్లాలో 551 మంది ప్రభుత్వ తీఫ్ట్ సాయం పొందుతున్నారు.. ఈ లెక్కన వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న వేలాది చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షలా మారాయి.
అంతంతే..
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అంతంత మాత్రమే.. కొన్ని పథకాల అమలు నామమాత్రంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గత 14 నెలలుగా త్రిఫ్ట్ పథకం సాయం అందడం లేదు. నేతన్న భరోసా పథకం, వ్యక్తిగత రుణాల మంజూరు, జియో ట్యాగ్ పెండింగ్, క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, చనిపోయిన నేత కార్మికుల బీమా డబ్బుల జాప్యం తదితర సమస్యలు చేనేత కార్మికులను వీడడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించి చేనేత పరిశ్రమలో పూర్వవైభవం తేవాలని నేతన్నల ఆకాంక్ష.


