దూర ప్రయాణం పేరుతో కార్ల చోరీ
సిద్దిపేటకమాన్: దూరప్రాంతాలకు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాడు. కారులో దర్జాగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో భోజనం చేయాలని, రెస్టు తీసుకోవాలంటూ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకు వెళ్తాడు. అక్కడ డ్రైవర్ను ఏమార్చి కారుతో పరారవుతాడు. వాటిని ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తాడు. ఇదీ.. ఓ అంతర్రాష్ట్ర దొంగ స్టైల్. చివరికి పోలీసులకు చిక్కాడు. సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ గురువార ంఆ వివరాలను వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్కు చెందిన పెండ్యాల సుదర్శన్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 2019లో గజ్వేల్ పరిధిలోని ఓ రాజకీయ నాయకురాలి వద్ద డ్రైవర్గా పనిచేస్తూ రూ.50 వేలు దొంగిలించిన కేసులో తొలిసారిగా జైలు పాలయ్యాడు. జైలులో పరిచయమైన తోటి ఖైదీలతో చేతులు కలిపి బైటకు వచ్చాక వాహనాలను దొంగతనాలు ప్రారంభించాడు. ఈ కమ్రంలో జులై 2న ఎల్బీనగర్ ఫ్లైఓవర్ వద్ద సుదర్శన్ కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లడానికి వికారాబాద్ జిల్లాకు చెందిన అంగోత్ తుల్జా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అదేరోజు రాత్రి మల్లన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మంగోల్ ఎక్స్ రోడ్డు వద్ద డ్రైవర్ మూత్ర విసర్జన కోసం కారు పక్కకు ఆపగా అదే అదునుగా సుదర్శన్ కారుతో పరారయ్యాడు. దీంతో కారు డ్రైవర్ కుకునూర్పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సదర్శన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పలుచోట్ల కార్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.10 లక్షల విలువైన రెండు కార్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషిచేసిన సీఐ లతీఫ్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుళ్లు రమేశ్, రాజు, శివ, రాజేశ్, రత్నాకర్, చంద్రం, సిబ్బందిని ఆమె అభినందించారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
రూ.10 క్షల విలువైన వాహనాలు స్వాధీనం
వివరాలు తెలిపిన సీపీ రష్మీ పెరుమాళ్


