వర్గల్(గజ్వేల్): లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 290 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం వర్గల్ మండలం గౌరారం పోలీసులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కాగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ రహదారి మీదుగా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో గౌరారం ఎస్ఐ ఆరోగ్యం తన సిబ్బందితో పీఎస్ ఎదుట వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వస్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. సివిల్ సప్లైస్ అధికారి సాయిరవి సమక్షంలో పంచనామా నిర్వహించారు. లారీ యజమాని పలాడి చింతన్న సూచనలకు అనుగుణంగా హైదరాబాద్ తుక్కుగూడలోని ఓ గోడౌన్ నుంచి ఈ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో లారీ డ్రైవర్ దాసా రామ్దేవ్ హజాభాయ్ వెల్లడించాడు. ఈ మేరకు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, స్వాధీనం చేసుకున్న 290 క్వింటాళ్ల బియ్యాన్ని నర్సన్నపేట శ్రీరామాంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ గోదాముకు తరలించి భద్రపరిచామని సీఐ చెప్పారు. గడచిన నెలరోజుల్లో ఇది రెండో ఘటన కాగా గతనెల 14న ఇదే ప్రాంతం నుంచి గుజరాత్కు 294.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని గౌరారం పోలీసులు పట్టుకున్న విషయం తెల్సిందే.
పోలీసుల తనిఖీలో పట్టుబడిన లారీ
290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం


